Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : మంగళవారం నర్సీపట్నంలో తెదేపా మినీ మహానాడు పండుగలా నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి సుమారు 4,000 మందికి పైగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ముఖ్యంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ప్రకటించాలనే తీర్మానాన్ని ఆమోదిస్తూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. కార్యకర్తల అంకితభావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలోనే నిలకడగా కొనసాగుతున్నారని, తమ కుటుంబానికి అవినీతి రాజకీయాలకు సంబంధం లేదన్నదే ఆయన ధైర్యంగా మాట్లాడటానికి కారణమని ఆయన వివరించారు. చిన్నతనం నుండీ తెదేపా జెండాను చూసే పెరిగిన తాము, చివరి శ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటామని విజయ్ వెల్లడించారు. నర్సీపట్నం అభివృద్ధికి గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిరంతరం శ్రమిస్తున్నారని, పది నెలల వ్యవధిలో 117 కోట్ల రూపాయలు నిధులను నియోజకవర్గానికి తీసుకురాగలిగారని, అంటే నెలకు సగటున 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనలో నర్సీపట్నాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తలపై దాడులు చేస్తారన్న అర్థంలేని ప్రచారం జరుగుతోందని, అది పూర్తిగా అసత్యమన్నారు. గత పాలనలో లిక్కర్ రంగంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలకు గుర్తింపు లభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఫోటోలు ప్రతి కార్యక్రమంలోనూ తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. అనకాపల్లి జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం నర్సీపట్నమేనని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియంత పాలనలో మాట్లాడే అవకాశం లేని సమయంలో, తెదేపా పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చిన ఘనత స్పీకర్ అయ్యన్నపాత్రుడుదేనని కొనియాడారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన పలువురు నాయకులను కార్యకర్తలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, పట్టణ తెదేపా ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, నాలుగు మండలాల నాయకులు కాశీనాయుడు, నందిపల్లి వెంకటరమణ, ఎర్రాపాత్రుడు, అడిగర్ల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV