Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ, నకిలీ నోట్లతో అమాయకులను వంచిస్తున్న ముగ్గురు వ్యక్తులను నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ సర్కిల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ రేవతమ్మ వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం డి.ఎస్.పి ఆధ్వర్యంలో రూరల్ సీఐ కు వచ్చిన నమ్మకమైన సమాచారంతో, నర్సీపట్నం రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు మరియు సిబ్బంది స్థానిక నెల్లిమెట్ట జంక్షన్ సమీపంలోని బుచ్చంపేట వైపు వెళ్లే రహదారిలోని రాతి పణుకు వద్ద దాడి నిర్వహించారన్నారు. ఈ దాడి సమయంలో ఆ ప్రదేశంలో ఏపీ 39 ఈ డబ్ల్యు 9681 నంబరు గల సుజుకి సెలెరియో కారు నిలిపి ఉంచి ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. పోలీసులను చూచి అందులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని, విజయనగరం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్దనుండి రూ.2 లక్షల 60 వేలు అసలు నోట్లను, రూ 10 లక్షల విలువ గల నకిలీ నోట్లను, ఒక సుజుకి సెలోరియ కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని, మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని రూరల్ సీఐ రేవతమ్మ వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV