Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: మొక్కను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి:: రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యపాత్రుడు అనకాపల్లి ఆగష్టు 30: ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యపాత్రుడు అన్నారు. వనమహోత్సవం-2024 కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఉదయం అనకాపల్లి స్థానిక డాక్టర్ ఎన్టీ రామారావు మార్కెట్ యార్డ్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులుంటున్నాయన్నారు. గతంలో తాను అటవీ మంత్రిగా ఉన్న సమయంలో రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్, ఎన్సీసీ వంటి విద్యార్థి విభాగాలతో ప్రత్యేకంగా ఒకే రొజు లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకునేవారమన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు వద్దని సూచించిన కొన్ని జాతుల మొక్కలను నాటవద్దన్నారు. అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు వెడల్పు చేసినప్పుడు చెట్లు నరికితే వాటిని తిరిగి పెంచేందుకు ప్రత్యేకంగా రోడ్డు పని బడ్జెట్ లోనే నిధుల కేటాయింపు జరిగేలా అనకాపల్లి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్ తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదికి పది శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటే, ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క విద్యార్థి వారి ఇంటి పరిసర ప్రాంతాలలో మూడు మొక్కలను నాటి వాటి సంరక్షణ వారే తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.* జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాల 60 లక్షల మొక్కలు నాటామని భవిష్యత్తులో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అన్ని స్కూల్స్ లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, డి ఎఫ్ ఓ జగన్నాథ్ సింగ్ లతో కలసి మొక్కలను నాటారు. చివరగా విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Rapid TV